
Nara Lokesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరిగిన క్వశ్చన్ అవర్లో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు శుభవార్త చెబుతూ, త్వరలోనే మరో DSC నిర్వహించి టీచర్ల భర్తీ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కర్నూలుతో పాటు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీచర్–స్టూడెంట్ రేషియో తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ లోటును త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు ఉంటేనే నాణ్యమైన విద్య అందుతుందన్న దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు.
రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై కూడా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ సీజనల్ హాస్టల్స్ సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. అలాగే సమగ్ర శిక్ష అభియాన్ కింద పని చేస్తున్న ఉపాధ్యాయులు, డేటా ఆపరేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జీతాలు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కావడంతో జీతాల పెంపు అంశం కేంద్రంతో ముడిపడి ఉందని చెప్పారు.
ఈ అంశంపై త్వరలో కేంద్ర ప్రభుత్వంతో జరగనున్న సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా ఒక బలమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన వివరించారు.
కర్నూలు ప్రాంతంలోని విద్యా సంస్థల్లో అనేక కొత్త కోర్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నామని మంత్రి తెలిపారు. స్థానికంగా వివిధ రంగాల్లో పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో, వాటికి అనుగుణంగా కోర్సులు రూపకల్పన చేయనున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని నారా లోకేష్ స్పష్టం చేశారు.


