
హైదరాబాద్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్లేట్లబురుజులోని కార్ హెడ్క్వార్టర్స్లో నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, నగరవాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం అనేది ప్రతి భారతీయుడికి అత్యంత పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని సీపీ సజ్జనార్ గుర్తు చేశారు. అలాగే దేశ భద్రత కోసం వేలాది మంది పోలీసులు తమ జీవితాలను అర్పించారని చెప్పారు. వారి త్యాగాలు వృథా కాకుండా దేశ భద్రత, సమాజ శాంతి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను గౌరవించడం ద్వారా మాత్రమే నిజమైన గణతంత్ర భావన నిలుస్తుందన్నారు.
హైదరాబాద్ను దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పోలీసింగ్లో మానవీయ దృక్పథాన్ని అవలంబిస్తూ, విక్టిమ్ మరియు సిటిజన్ సెంట్రిక్ విధానంతో బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాధితులు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా వారి ఇంటివద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని తెలంగాణలో అమలు చేశామని వివరించారు.
మహిళలు, చిన్నారుల కేసుల్లో తక్షణ స్పందనకు ప్రాధాన్యం ఇస్తున్నామని సీపీ తెలిపారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి EYES యాప్ను ప్రవేశపెట్టామని చెప్పారు. నేరాల నివారణే లక్ష్యంగా ‘Prevention is Better than Cure’ సూత్రాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ‘అరైవ్ అలైవ్’ వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరి చేసి ప్రాణ రక్షణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు బలమని, ప్రజల సహకారంతోనే సురక్షిత సమాజం సాధ్యమని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలను కాపాడాలని అందరికీ పిలుపునిచ్చారు.


