spot_img
spot_img
HomeAnanthanpuramప్రజాసంతోషమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

ప్రజాసంతోషమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

గ్రామాల్లో ప్రజలు సంతోషంగా జీవించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ స్పష్టం చేశారు. మండల పరిధిలోని గూటిబైలు సమీపంలో వెలసిన ప్రసిద్ధ తిమ్మమ్మ మర్రిమాను వద్ద శనివారం ఆయన ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ప్రజలతో ముఖాముఖి సంభాషణ జరిపిన ఎమ్మెల్యే వారి ఇబ్బందులను శ్రద్ధగా వినడం విశేషంగా నిలిచింది.

ప్రజాదర్బార్‌లో గృహ నిర్మాణ బిల్లులు, భూ సమస్యలు, ఒంటరి మహిళల పింఛన్లు తదితర అంశాలపై దాదాపు 20 వినతులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి వినతిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు చిన్నవే అయినప్పటికీ అవి ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

శ్మశాన వాటికకు సీఎస్‌ఆర్‌ నిధులతో రోడ్డు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని, పక్షపాతం లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఆయన హితవు పలికారు.

తిమ్మమ్మ మర్రిమాను ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తనవంతుగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. తిమ్మమ్మ మర్రిమాను ద్వారా గ్రామీణ ప్రాంతాలకు గుర్తింపు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఏడాది మహా శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ మర్రిమాను తిరునాళ్లను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దేవేంద్రనాయక్‌, ఎంపీడీఓ పార్థసారథి, టీడీపీ మండల కన్వీనర్‌ శ్రీరాముల నాయుడు, సర్పంచ విష్ణుమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments