
ఆదిలాబాద్ జిల్లా తనకు ఎంతో ప్రత్యేకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్కు జరగాల్సిన న్యాయం, చేయాల్సిన అభివృద్ధి గత ప్రభుత్వాల కాలంలో జరగలేదని విమర్శించారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకూ నిధులు కేటాయిస్తున్నామని, జిల్లా అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. నిర్మల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
భూసేకరణకు అవసరమైన నిధులు మంజూరు చేసి పలు కీలక ప్రాజెక్టులను పూర్తి చేశామని సీఎం వివరించారు. ఉమ్మడి జిల్లాకు విశ్వవిద్యాలయం లేని లోటును గుర్తించి, బాసరలో ఆదిలాబాద్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ వర్సిటీకి అధికారిక మంజూరు లభిస్తుందని తెలిపారు. అలాగే తుమ్మడి హెట్టీ వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం తప్పకుండా చేపడతామని, ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేస్తామని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ తీసుకురావడం తన బాధ్యతగా భావిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ శిలాఫలకం వేయిస్తామని చెప్పారు. మోడీ తనకు చుట్టం కాదు, దేశానికి ప్రధాని కావడంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన్ని కలుస్తున్నానని, ప్రాంత అభివృద్ధి కోసం ఎవ్వరినైనా కలుస్తానని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే ఉండాలి, అభివృద్ధికి అందరూ కలసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వాల పాలన వల్ల రాష్ట్రంపై అప్పులు మిగిలాయని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నదని, మహిళలకు భూములు కేటాయించామని చెప్పారు. నాగోబా జాతరకు రూ.22 కోట్లు మంజూరు చేస్తామని, సమ్మక్క-సారలమ్మ మందిరాన్ని పునర్నిర్మించి ఈ నెల 18న మేడారంలో ప్రారంభిస్తామని తెలిపారు.
హైదరాబాద్ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేశామని, రాష్ట్ర ప్రజల సహకారంతో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచే వారిని గెలిపించాలని కోరారు.


