
రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ గారు, మాదిగ ఉపకులాల ప్రతినిధులు ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు.
ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు ఎదురు కావొద్దన్న ఆలోచనతో ప్రక్రియను చట్టబద్దంగా ముందుకు తీసుకువెళ్లామని, అందులో భాగంగానే తొలుత అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీని నియమించడంతో పాటు న్యాయ కమిషన్ ఏర్పాటు చేశామని వివరించారు. సాధ్యమైనంత తొందరగా సదరు నివేదికలను తెప్పించి, కమిషన్ సిఫార్సులను కేబినెట్ లో, ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించామని సీఎం గారు గుర్తుచేశారు.
ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారని మంద కృష్ణ గారు ఈ సందర్భంగా అభినందించారు. వర్గీకరణ ప్రక్రియను ఒక నిబద్ధతతో చేపట్టిన ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని మందకృష్ణ గారు తెలిపారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.
ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు.