
విశాఖపట్నంలో నవంబర్ 14,15 తేదీల్లో జరగబోయే ప్రతిష్టాత్మక సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ విజయవంతం కావాలని లక్ష్యంగా పెట్టుకుని, దేశంలోని ప్రముఖ పెట్టుబడిదారులతో ముంబయి తాజ్ ప్యాలెస్ హోటల్లో రోడ్షో నిర్వహించాను. ఈ రోడ్షోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందిస్తున్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించాను.
@ncbn గారి సమర్థ నాయకత్వం వల్లే గ్లోబల్ స్థాయి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పాను. పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు, మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్లే ఏపీ వ్యాపారానికి అనుకూల రాష్ట్రంగా ఎదుగుతోందని తెలియజేశాను.
ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఉదాహరణగా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ను ప్రస్తావించాను. ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు నవంబర్లో ప్రారంభమవుతుండటం పెట్టుబడిదారుల నమ్మకానికి సూచిక అని వివరించాను.
అదే విధంగా, వన్ గిగావాట్ సామర్థ్యం కలిగిన గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఈ నెల 14వ తేదీన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని చెప్పాను. ఇది ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఎకానమీ అభివృద్ధికి కొత్త దారులు తీసుకురానుంది.
పెట్టుబడులకు అత్యంత అనుకూల వాతావరణం కలిగిన ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అందరినీ ఆహ్వానించాను. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులందరికీ అవసరమైన సహకారం, మద్దతు అందించడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చాను. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని, రాబోయే సమ్మిట్ ద్వారా మరిన్ని గ్లోబల్ భాగస్వామ్యాలు ఏర్పడతాయని విశ్వాసం వ్యక్తం చేసాను.


