
పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలను నిర్భయంగా చెప్పుకునే వేదికను కల్పించాలనే ఆలోచన నుంచే షీ టీమ్స్ ఆవిర్భవించాయని రాష్ట్ర అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. మహిళలకు భద్రత, న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. మహిళలు తమ సమస్యలను దాచుకోకుండా ముందుకు వచ్చి చెప్పేలా షీ టీమ్స్ నమ్మకాన్ని కల్పిస్తున్నాయని అన్నారు.
యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వై ఫ్లో) 20వ వార్షికోత్సవాన్ని **బంజారాహిల్స్**లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఫ్లో మాజీ చైర్పర్సన్లు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళలతో ప్రత్యేక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయగా, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ మహిళల్లో ధైర్యం లోపించిందని తాను భావించడం లేదన్నారు. నగరాల్లో మహిళల భద్రత పరంగా పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అవగాహన, చర్యలు పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి మహిళకు న్యాయం జరిగేలా షీ టీమ్స్ నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు.
చర్చలో బయలాజికల్ ఈ సంస్థ అధినేత్రి మహిమా దాట్ల, విద్యావేత్త అంజుమ్ బాబూఖాన్, సినీ నిర్మాత స్వప్న దత్, గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని, నారాయణ సంస్థల అధినేత్రి డాక్టర్ పి.సింధూర నారాయణ తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ, ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, మానవ మేథస్సు పాత్ర కీలకమని పలువురు అభిప్రాయపడ్డారు.
మహిళల భద్రత, సాధికారత దిశగా షీ టీమ్స్ చేస్తున్న కృషి సమాజానికి దిశానిర్దేశకంగా నిలుస్తోందని వక్తలు ప్రశంసించారు. ఇలాంటి వేదికలు మహిళలకు ధైర్యం, అవగాహన కల్పించి సమానత్వ సమాజ నిర్మాణానికి దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


