
భారత్లో వెండి దిగుమతులు ఇటీవల గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రాబోయే సాధారణ బడ్జెట్ 2026పై మార్కెట్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో వెండి దిగుమతులు 79.7 శాతం పెరగడం విశేషంగా మారింది. ఈ అకస్మాత్తు పెరుగుదల దేశ విదేశీ వాణిజ్య సమతుల్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ దిగుమతులను నియంత్రించేందుకు వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత్ తన వెండి అవసరాల్లో పెద్ద భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో దిగుమతి బిల్లు భారీగా పెరగడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. అందుకే రాబోయే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచవచ్చనే చర్చలు జోరందుకున్నాయి. ఈ భయం కారణంగా ఇప్పటికే దేశీయ మార్కెట్లో వెండి అధిక ప్రీమియంతో వర్తకం అవుతోంది.
గణాంకాలను పరిశీలిస్తే డిసెంబర్లో వెండి దిగుమతులు గత నెలతో పోలిస్తే 0.76 బిలియన్ డాలర్లకు చేరి 79.7 శాతం పెరిగాయి. అలాగే ఏప్రిల్–డిసెంబర్ కాలంలో వెండి దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 129 శాతం పెరిగి 7.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇవి కేవలం 3.39 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండటం గమనార్హం.
సాధారణంగా పండుగల సీజన్లో వెండి దిగుమతులు పెరగడం సహజం. కానీ ఈ ఏడాది పండుగ సీజన్ ముగిసిన తర్వాత కూడా దిగుమతులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత బడ్జెట్లో ప్రభుత్వం వెండిపై దిగుమతి సుంకాన్ని 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. అక్రమ రవాణాను అరికట్టడం, దేశీయ మార్కెట్లో అమ్మకాలు పెంచడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం వెండిపై 6 శాతం కస్టమ్స్ సుంకం, 3 శాతం జీఎస్టీ అమలులో ఉన్నాయి. అయితే డిమాండ్ భారీగా పెరగడంతో దిగుమతులు అదుపు తప్పుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో దిగుమతి సుంకం పెరిగే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని ట్రేడ్బుల్స్ సెక్యూరిటీస్కు చెందిన భావిక్ పటేల్ తెలిపారు. సుంకం పెరిగితే వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


