
ఏపీ మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయన క్యాపిటాల్యాండ్ సంస్థ CEO సంజీవ్ దాస్ గుప్తాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ముఖ్యంగా పారిశ్రామిక కారిడార్లలో గిడ్డంగులు, పార్కుల ఏర్పాటుపై లోకేష్ ప్రాధాన్యతనిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్లలో అధునాతన లాజిస్టిక్స్ మరియు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటవ్వాలని అభిప్రాయపడ్డారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకు పునరుత్పాదక శక్తిని అందించడానికి CLI క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను వినియోగించవచ్చని సూచించారు. సాంప్రదాయ ఐటీ కంపెనీలు టియర్-2 నగరాలైన వైజాగ్, విజయవాడ వైపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో అక్కడ సాఫ్ట్వేర్ పార్కులు, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులను ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
మంత్రిగారి విజ్ఞప్తికి స్పందించిన క్యాపిటాల్యాండ్ CEO సంజీవ్ దాస్ గుప్తా, సంస్థ ధీషన్ గ్లోబల్ స్పేసెస్తో కలిసి శ్రీ సిటీ సమీపంలో రూ.400 కోట్ల పెట్టుబడితో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు.
అయితే భూసేకరణకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఉన్నాయని, కొల్లాడం గ్రామంలోని 110 ఎకరాల తమ భూమిని ప్రభుత్వ భూసేకరణ నుండి మినహాయించాలని సంస్థ కోరింది. GOMS. నం. 39, తేదీ 25-03-2025 ప్రకారం తమ భూములు భూసేకరణలో ఉన్నాయని వివరించారు.
ఈ సమస్యను మంత్రి లోకేష్ సానుకూలంగా పరిశీలించారు. APIIC అధికారులతో చర్చించి క్యాపిటాల్యాండ్ సంస్థకు భూమి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనివల్ల రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


