
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) సైఫాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో, రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (Rural Self Employment Training Institute) స్వర్ణభారత్ క్యాంపస్లో మెగా MSME అవుట్ రీచ్ క్యాంప్ (Mega MSME Outreach Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మందాడి శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్యాంప్కు సుమారు 600 మంది ఖాతాదారులు హాజరయ్యారు.
ఈ క్యాంప్లో MSME ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి ఖాతాదారులకు అవగాహన కల్పించారు. MSME రంగానికి బ్యాంకులు అందిస్తున్న రుణాల ద్వారా, దేశంలో దాదాపు 65% మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అధికారులు వివరించారు. ఈ అవుట్ రీచ్ క్యాంప్ దేశవ్యాప్తంగా 157 యూనియన్ బ్యాంక్ కార్యాలయాల్లో మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
క్యాంప్లో 50 మంది MSME ఖాతాదారులకు సుమారు ₹100 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలు అందజేశారు. బ్యాంక్ అధికారులు MSME యజమానులకు రుణాల ప్రాధాన్యత, తిరిగి చెల్లింపుల విధానం, ప్రభుత్వ అనుబంధ పథకాలు గురించి వివరించారు. చిన్న స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంక్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో MSME ముంబై వెర్టికల్ సీవో జీకే సుధాకర్ రావు, యూనియన్ బ్యాంక్ ముంబై సెంట్రల్ ఆఫీసు జనరల్ మేనేజర్ ఆర్.ఎల్. పట్నాయక్, హైదరాబాద్ జోనల్ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్, సైఫాబాద్ డీజీఎమ్ సోనాలిక, ఏజీఎంలు రవి, లేపాక్షి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ క్యాంప్ ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులకు ఆర్థిక మద్దతు, బ్యాంకింగ్ సదుపాయాలు, ప్రభుత్వ రుణ పథకాలు గురించి అవగాహన కల్పించారు. ఉద్యోగసృష్టి, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించే దిశగా MSME రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా MSME రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ తరహా అవుట్రీచ్ కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు బ్యాంక్ అధికారులు ప్రకటించారు.


