
బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘ధురంధర్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి మరోసారి చర్చకు దారి తీసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్ల వసూళ్లు సాధించి సంచలనంగా నిలిచింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో దేశవ్యాప్తంగా మరింత మంది ప్రేక్షకులను చేరుకుంటోంది.
థియేటర్లలో విడుదలైనప్పుడు భారీ యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి అంశాలు, ఇంటెన్స్ కథనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ పాత్ర, అతని ఎనర్జీ, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అక్షయ్ ఖన్నా పాత్ర కూడా కథలో కీలక మలుపులు తిప్పుతూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ విజయం తర్వాతే అభిమానులు ధురంధర్–2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాపై నెట్ఫ్లిక్స్పై అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో చూసిన వెర్షన్తో పోలిస్తే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న వెర్షన్ నిడివి తక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి. థియేటర్లో ఈ సినిమా దాదాపు 3 గంటల 45 నిమిషాలు ఉండగా, ఓటీటీ వెర్షన్లో కేవలం 3 గంటల 25 నిమిషాలే ఉందని అభిమానులు చెబుతున్నారు.
దీంతో దాదాపు 9 నుంచి 10 నిమిషాల కీలక సన్నివేశాలు తొలగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీడియో, ఆడియో క్వాలిటీ కూడా థియేటర్ అనుభూతికి సరిపోవడం లేదని సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువెత్తుతోంది. సినిమా ఓటీటీలోకి వచ్చిన కొద్దిసేపటికే ఈ అంశం ట్రెండింగ్గా మారింది.
మొత్తంగా, ‘ధురంధర్’ ఓటీటీ రిలీజ్ అభిమానుల్లో మిశ్రమ స్పందన తెచ్చింది. ఒకవైపు రీజినల్ భాషల్లో సినిమా అందుబాటులోకి రావడం ఆనందం కలిగిస్తే, మరోవైపు కట్ చేసిన సీన్లు, నిడివి తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెట్ఫ్లిక్స్ ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుందో, పూర్తి వెర్షన్ను విడుదల చేస్తుందో చూడాలి.


