
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ (AP) తీసుకుపోతున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కృష్ణా బోర్డు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను ఎపి ఇష్టానుసారంగా తరలిస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి సర్కారులో కదలిక లేదని ఆయన మండిపడ్డారు. కృష్ణా బోర్డు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది తప్ప చర్యలు తీసుకోవడం లేదని కెటిఆర్ విమర్శించారు.
నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడు నెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కృష్ణా జలాలను ఎపి తరలిస్తోందని కెటిఆర్ ఆరోపించారు. ఇప్పటికే 646 టిఎంసిలను ఎపి వినియోగించిందని ఆయన మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు అడ్డుకోవడం లేదని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి నదుల్లోని బొట్టుబొట్టునూ కాపాడి బీడు భూములను సైతం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సస్యశ్యామలం చేశారని కెటిఆర్ కొనియాడారు. కానీ ఇప్పుడు ఏడాది కాలంలోనే పంటపొలాలను కాంగ్రెస్ ఎండబెట్టిందని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అలాంటిది వాటిని ఒక్కొక్కొటిగా రేవంత్ రెడ్డి సర్కార్ గంగలో కలుపుతోందని కెటిఆర్ విమర్శల వర్షం కురిపించారు.
రాబోయేది వేసవి కాలమని.. తాగు, సాగునీళ్లకు కష్టకాలమని మాజీ మంత్రి కెటిఆర్ చెప్పుకొచ్చారు. అన్నీ తెలిసినా రేవంత్ రెడ్డి మాత్రం గాలిమోటర్లో ఢిల్లీ ట్రిప్పులు కొడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులకు అన్నదాతల గోస ఏం తెలుస్తుందని ధ్వజమెత్తారు. కెఆర్ఎంబీ పరిధిలోని త్రీమెన్ కమిటీ దిక్కులేదని.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జాగో రైతున్న జాగో.. జాగో తెలంగాణ జాగో.. అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.